ముహర్రం పండుగ సందర్భంగా పట్టణంలో పీర్ల ఊరేగింపు
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ముస్లింలు, హిందువులు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వేడుకలు
తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ: ముహర్రం పండుగను పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలో శుక్రవారం పీర్ల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో ముస్లింలతో పాటు హిందూ సోదరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.
రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన పీర్లను యువకులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, నగారా మోతల మధ్య ఊరేగింపు సాగింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, ప్రధాన రహదారి మీదుగా ఓల్డ్ వీక్లీ మార్కెట్ వరకు ఊరేగింపు సాగగా, తిలకించేందుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. పలుచోట్ల చిరు వ్యాపారులు షర్బత్, పానకం పంపిణీ చేశారు. (బోర్లంలో పీర్ల పండగ వీడియో 👇)
ముహర్రం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ పీర్ల ఊరేగింపుతో పట్టణం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ముస్లింలు, హిందువులు కలిసి నిర్వహించిన ఈ వేడుక మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది.



إرسال تعليق