మహిళల భద్రత సమాజ ప్రగతికి పునాది: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి లేబర్ అడ్డాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 06: మహిళల భద్రత సమాజ ప్రగతికి బలమైన పునాది అని, మహిళలు, బాలల రక్షణకు ప్రజల సహకారం అవసరమని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 99 రోజుల అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం శనివారం కామారెడ్డి పట్టణంలోని లేబర్ అడ్డాలో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది కార్మికులు పాల్గొని మహిళల భద్రత, బాలల సంక్షేమం, సామాజిక బాధ్యతలపై అవగాహన పొందారు.
ఏహెచ్టీయూ అధికారులు మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాల దుష్పరిణామాలు, బాలల భద్రత, లింగ వివక్ష, లింగ పక్షపాతం, మహిళలపై హింస, సైబర్ నేరాలు, సైబర్ వేధింపులు, షీ టీమ్స్ సేవలు, రోడ్డు భద్రత అంశాలపై వివరించారు.
సమాజంలో ఎక్కడైనా మహిళలు, బాలలు లేదా సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు, వేధింపులు, నేరాలు గుర్తించిన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1930 సైబర్ హెల్ప్లైన్, 1098 చైల్డ్ హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహిళలు, బాలలు, బలహీన వర్గాల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏహెచ్టీయూ సిబ్బంది, కళాబృందం సభ్యులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. లేబర్ అడ్డా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాస్, డైలీ లేబర్ కార్మికులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.

إرسال تعليق