#24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న భిక్నూర్ పోలీసులు
#మెరుపు వేగంతో స్పందించిన పోలీసులు
#దోపిడీకి గురైన 5 తులాల బంగారం రికవరీ
#నిందితుడు అరెస్ట్, రిమాండ్కు తరలింపు
#పథకం వేసిన నేరం అయినా… పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోలేరు
#వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
ఆదివారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో భిక్నూర్ గ్రామం గాజులపేట గల్లీలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పరి లచ్చవ్వ ఇంటిలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి, ఆమెపై రోకలి బండతో దాడి చేసి మెడలో ఉన్న బంగారు పూస్తేల తాడు, గుండ్లను దోపిడీ చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భిక్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఏఎస్పీ చైతన్య రెడ్డి పర్యవేక్షణలో భిక్నూర్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, అత్యాధునిక సాంకేతిక ఆధారాలను అత్యంత చాకచక్యంగా విశ్లేషించిన పోలీసులు, నేరం జరిగిన 24 గంటల లోపే నిందితుడుగజ్జ స్వామి (54)ని భిక్నూర్ చర్చ్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించగా, అతని వద్ద నుండి దోచుకున్న బంగారు ఆభరణాలు మరియు నేరానికి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాల్లోకి వెళ్తే....భిక్నూర్ గ్రామం గాజులపేట గల్లీకి చెందిన నిందితుడు గజ్జ స్వామి, అదే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పరి లచ్చవ్వ కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టాడు. ఆమె ఒంటరిగా ఉండటం, పైగా ఒంటిపై బంగారం ధరించడాన్ని గమనించిన నిందితుడు, ఎలాగైనా ఆ సొత్తును దోచుకోవాలని పథకం రచించాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో, ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితుడు ముందుగానే సిద్ధం చేసుకున్న మాస్క్ మరియు క్యాప్ ధరించి బాధితురాలి ఇంటిలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే ఎవరూ రాకుండా తలుపులు గడియపెట్టి, ఇంట్లో ఉన్న రోకలి బండతో బాధితురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె తీవ్ర భయాందోళనకు గురైన సమయంలో, ఆమె మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను (పూస్తేల తాడు, గుండ్లు) బలవంతంగా లాక్కొని, బయట సిద్ధంగా ఉంచుకున్న తన బైక్పై వేగంగా పరారయ్యాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, అనంతరం రిమాండ్కు తరలించడం జరిగింది.
అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ అంజనేయులు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని కామారెడ్డి ఏఎస్పీ తెలిపారు.

Post a Comment