బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్ వికటించి ఐదుగరు బాలింతల అస్వస్థత
10 మందిలో ఐదుగురికి తీవ్ర ఇబ్బందులు
ప్లేట్లెట్స్ పడిపోవడం, కిడ్నీ, మూత్ర ఇన్ఫెక్షన్ లక్షణాలు
వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలింపు
ఏమి జరిగిందో విచారణ జరుపుతున్నాం: సూపరింటెండెంట్ విజయభాస్కర్
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ : బాన్సువాడలోని మాతా శిశు ఆసుపత్రి లో శుక్ర, శనివారాల్లో చేసిన సిజేరియన్ ఆపరేషన్లు వికటించడంతో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కలకలం రేగింది.
10 సిజేరియన్లలో ఐదుగురికి సమస్య
బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పరిధిలోని మాతా శిశు ఆసుపత్రిలో గత శుక్ర, శనివారాల్లో మొత్తం 10 మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించారు. అయితే వారిలో ఐదుగురు బాలింతల ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది.
ఆపరేషన్ అనంతరం వారిలో ప్లేట్లెట్స్ అసాధారణంగా పడిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు తలెత్తడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
జిల్లా కేంద్ర ఆసుపత్రికి రిఫర్
విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్ స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు బాలింతలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది.
బంధువుల ఆందోళన
ఒకేసారి ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు అనుభవజ్ఞురాలే అయినా ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సిజేరియన్ సమయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఐదుగురికి ఆపరేషన్లు చేయగా, వారే అస్వస్థత చెందారని, ఆ రోజే నిర్లక్ష్యం జరిగిందని తెలిపారు.
విచారణ జరుపుతున్నాం: సూపరింటెండెంట్
ఈ విషయంపై 'తెలంగాణ డైలీ న్యూస్' సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్ను వివరణ కోరగా, "ఐదుగురు బాలింతలు తీవ్ర అస్వస్థతకు గురైనది వాస్తవమే. వారి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. మెరుగైన వైద్యం కోసం వారిని నిజామాబాద్కు రిఫర్ చేశాం" అని తెలిపారు.
ఘటనపై ఉన్నతాధికారులు కూడా సమాచారం సేకరిస్తున్నారు.
![]() |
| సిజెరియన్ జరిగిన తర్వాత చికిత్స పొందుతున్న మహిళలు |


إرسال تعليق