Sub Collectors Transfer | ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సబ్ కలెక్టర్ల బదిలీ

 

వాటర్ ట్యాంక్ పై ఎక్కి యువతి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్ కిరణ్మై (ఫైల్ ఫోటో)

•రంగారెడ్డి కు బదిలీ అయిన బాన్సువాడ సబ్ కలెక్టర్

•ఎల్ బి నగర్ కు బదిలీ అయిన బోధన్ సబ్ కలెక్టర్

•రెండు చోట్లా ఖాళీ అయిన పోస్టులు

•రాష్ట్ర వ్యాప్తంగా బదిలీ అయిన ఐ ఏ ఎస్ అధికారుల జాబితా ఇదే 👆

తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్:

రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సబ్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.  బాన్సువాడ సబ్ కలెక్టర్ ను రంగారెడ్డి జిల్లాకు, బోధన్ సబ్ కలెక్టర్ ను ఎల్ బి నగర్ కు బదిలీ చేశారు. అయితే ఇరు చోట్ల కొత్త సబ్ కలెక్టర్లను నియమించలేదు. 


బాన్సువాడ నుంచి రంగారెడ్డికి కిరణ్మయి

బాన్సువాడ సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారిణి కొప్పిశెట్టి కిరణ్మయిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. సుమారు రెండేళ్లపాటు బాన్సువాడ డివిజన్‌లో పనిచేసిన కిరణ్మయి విద్య, వైద్యం, రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వరదల సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇటీవల నీటి ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన యువతిని స్వయంగా ట్యాంకు ఎక్కి కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చిన ఘటనతో ఆమె ప్రశంసలు అందుకున్నారు.


బోధన్ నుంచి ఎల్బీనగర్‌కు వికాస్ మహతో  

బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతోను హైదరాబాద్ ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. 2022 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వికాస్ మహతో 2024 సెప్టెంబర్‌లో బోధన్ సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం 19 నెలల పాటు బోధన్ డివిజన్‌లో పనిచేసి, తక్కువ వ్యవధిలోనే పరిపాలనా వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు.

ఒకే రోజు జిల్లాలోని రెండు కీలక డివిజన్ల సబ్ కలెక్టర్లు బదిలీ కావడంతో ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ప్రజలతో మమేకమై పనిచేసిన కిరణ్మయి బదిలీపై బాన్సువాడ ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు.

తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

 – 30 మందికి స్థానచలనం

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం రాత్రి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 30 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, జోనల్ కమిషనర్లు, శాఖాధిపతుల స్థాయిలో ఈ బదిలీలు జరిగాయి.

కీలక బదిలీలు - శాఖల్లో మార్పులు

- సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్‌ను ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా నియమించారు. 

- దాన కిషోర్‌ను పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు.

- హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిని ఎల్ఈటీ&ఎఫ్ శాఖ కార్యదర్శిగా నియమించారు.

కొత్త కలెక్టర్లు

- ప్రియాంక అలా హైదరాబాద్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

- భావేష్ మిశ్రా నిర్మల్ కలెక్టర్‌గా, ప్రతీక్ జైన్ సంగారెడ్డి కలెక్టర్‌గా, దివాకర టీఎస్ ఖమ్మం కలెక్టర్‌గా, హేమంత్ కేశవ్ పాటిల్ నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా, చెక్క ప్రియాంక నారాయణపేట్ కలెక్టర్‌గా, భోర్ఖాడే హేమంత్ ములుగు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు

- పి.ఉదయ్ కుమార్ గోల్కొండ జోనల్ కమిషనర్‌గా, బధావత్ సంతోష్ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

- నారాయణ అమిత్ మాలెంపాటి సెర్లింగంపల్లి, వికాస్ మహతో ఎల్బీనగర్, మయాంక్ సింగ్ కూకట్‌పల్లి, ఎస్.శ్రీనివాస్ రెడ్డి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్లుగా బదిలీ అయ్యారు.

నిజామాబాద్ జిల్లా అధికారుల బదిలీ 

- బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు.

- బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోను ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

పరిపాలనలో సామర్థ్యం పెంచడం, అనుభవాన్ని వినియోగించుకోవడం కోసమే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త అధికారులు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Post a Comment

Previous Post Next Post