చట్టాన్ని లెక్కచేయని మందుబాబుకు కోర్టు గట్టి షాక్
మద్యం మత్తులో స్టీరింగ్ పడితే జైలు ఖాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 20: "ఒక్కసారి తాగి డ్రైవ్ చేస్తే ఫైన్ కట్టి బయటపడొచ్చు" అని నిర్లక్ష్యంగా భావించే వారికి కామారెడ్డి పోలీసులు గట్టి హెచ్చరిక పంపారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ వరుసగా ఆరోసారి పోలీసులకు చిక్కిన నిందితుడికి గౌరవ న్యాయస్థానం ఏకంగా 12 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది.
ఘటన వివరాలు
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అయితే పోలీసులు నిందితుడి వాహన వివరాలను ఆన్లైన్ డేటాబేస్లో పరిశీలించగా షాకింగ్ నిజం బయటపడింది.
అదే నిందితుడు గతంలో ఐదు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడినట్లు పోలీస్ డిజిటల్ రికార్డులు వెల్లడించాయి. గతంలో ఎన్నిసార్లు జరిమానాలు విధించినా, కౌన్సిలింగ్ చేసినా, కఠినంగా హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, గత పూర్తి వివరాలను కోర్టులో సమర్పించారు.
నిందితుడి పాత రికార్డులు, సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం మొత్తం 12 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు వెంటనే నిందితుడిని రిమాండ్కు తరలించారు.
ఎస్పీ హెచ్చరిక
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, "మద్యం మత్తులో వాహనం నడపడం సాధారణ చట్ట ఉల్లంఘన కాదు, నడిరోడ్డుపై ప్రాణాలతో చెలగాటమాడటమే. మద్యం సేవించి స్టీరింగ్ పడితే డ్రైవర్తో పాటు తోటి ప్రయాణికులు, అమాయక రోడ్డు వినియోగదారుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మద్యం మత్తు కొన్ని గంటలే.. కానీ దాని పరిణామాలు జీవితాంతం వెంటాడవచ్చు" అని స్పష్టం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ను అలవాటుగా మార్చుకుంటే ఇదే పరిణామం తప్పదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు ఖాయమని ఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని కోరారు.



إرسال تعليق