ప్రతినెలా 100కు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ – ఈ ఏడాది ₹1.27 కోట్ల విలువైన 794 ఫోన్లు స్వాధీనం
CEIR పోర్టల్ ద్వారా ఇప్పటివరకు ₹8.12 కోట్ల విలువైన 5075 ఫోన్లు గుర్తింపు
ప్రత్యేక బృందంతో నెలకు 100+ ఫోన్ల రికవరీ
గత 30 రోజుల్లో ₹21.76 లక్షల విలువైన 136 ఫోన్లు స్వాధీనం
పోయిన ఫోన్కు వెంటనే ఫిర్యాదు, సిమ్ బ్లాక్ చేయాలి
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: మొబైల్ ఫోన్ పోయినా ఆందోళన వద్దని, CEIR పోర్టల్ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు.
ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో, RSI బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ బృందం అత్యాధునిక సాంకేతికతతో ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తోందన్నారు.
గత 30 రోజుల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ₹21.76 లక్షల విలువైన 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు ₹1.27 కోట్ల విలువైన 794 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గత ఏడాది సుమారు ₹3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను బాధితులకు అందజేశామని గుర్తు చేశారు.
CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 5075 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి, సుమారు ₹8.12 కోట్ల విలువైన ఫోన్లను బాధితులకు అప్పగించామని ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు.
ప్రస్తుత డిజిటల్ కాలంలో మొబైల్లో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత డేటా ఉంటాయని, ఫోన్ పోగొట్టుకోవడం వల్ల భద్రతకు, గోప్యతకు ముప్పు ఉందని ఎస్పీ అన్నారు. ఫోన్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిమ్ కార్డును బ్లాక్ చేయాలని, IMEI నంబర్ను CEIR పోర్టల్లో బ్లాక్ చేయాలని సూచించారు. గుర్తుతెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
రికవరీ అయిన ఫోన్లను పొందేందుకు బాధితులు తమ ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI బాలరాజు గారిని సంప్రదించవచ్చు. ఫోన్: 8712686114

Post a Comment