SIR హియరింగ్స్ను పారదర్శకంగా నిర్వహించాలి
అభ్యంతరాలు, క్లెయిమ్లను క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా ఇంచార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
EROలతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 05: SIR హియరింగ్స్ను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న హియరింగ్స్ ప్రక్రియపై జిల్లా ఇంచార్జి కలెక్టర్ శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు (ERO)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న హియరింగ్స్ ప్రక్రియ, ఇప్పటివరకు స్వీకరించిన అభ్యంతరాలు, క్లెయిమ్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి అభ్యంతరం, క్లెయిమ్ను తగిన ధ్రువపత్రాలతో పాటు ఎన్నికల నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
అభ్యంతరాలు, క్లెయిమ్లకు సంబంధించి సమర్పించిన ధ్రువపత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం మాత్రమే నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో సంబంధిత రికార్డులను కూడా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.
హియరింగ్స్ నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రతి కేసును నిబంధనల ప్రకారం, సమర్పించిన తగిన ధ్రువపత్రాల ఆధారంగా పరిశీలించి, అర్హతకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. హియరింగ్స్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి, ఆర్డీవోలు, సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment