కామారెడ్డి నియోజకవర్గంలో వినూత్న నిరసన
రోడ్లు ఊడ్చిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
భిక్కనూరు మండలం జంగంపల్లిలో బీఆర్ఎస్ నిరసన
కామారెడ్డి బ్యూరో, సెప్టెంబర్ 06: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్య పాలనకు నిరసనగా కామారెడ్డి నియోజకవర్గంలో వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ రోజుకో కార్యక్రమంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
ఆదివారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను ఎత్తిచూపుతూ గ్రామంలోని రోడ్లను స్వయంగా గంప గోవర్ధన్, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ చీపుర్లతో శుభ్రం చేసి చెత్తను తొలగిస్తూ కాంగ్రెస్ పాలనలో పడకేసిన పారిశుద్ధ్య వ్యవస్థను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో పారిశుధ్యానికి, అభివృద్ధికి పెద్దపీట వేశామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కనీస పారిశుధ్య సౌకర్యాలు కూడా కరువయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ఆసరా పింఛన్లతో పాటు రైతులు, విద్యార్థులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. 420 హామీలు నెరవేసే వరకు వినూత్న తరహాలో వ్యతిరేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆరెస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Post a Comment