•నలుగురు సభ్యుల కోసం నామినేషన్ల స్వీకరణ
•మే 1 లోగా దరఖాస్తు సమర్పించాలి
తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ :
బాన్సువాడ పురపాలక సంఘం కార్యాలయం మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం కలిగిన కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
జీవో ఎంఎస్ నం.57, 58 తేది: 16.03.2020 ప్రకారం ఇద్దరు సభ్యులను ప్రత్యేక పరిజ్ఞానం/అనుభవం కలిగిన వారి నుండి, మరో ఇద్దరు సభ్యులను అల్పసంఖ్యాక వర్గాల నుండి ఎంపిక చేయనున్నారు. ప్రతి విభాగంలో ఒకరు మహిళా సభ్యురాలు ఉండాలి.
అర్హతలు:
ప్రత్యేక పరిజ్ఞానం/అనుభవం కలిగిన సభ్యులకు:
1. మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిస్టర్ అయి ఉండాలి, వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి.
2. మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్ పర్సన్/వైస్ చైర్ పర్సన్/వార్డు మెంబర్ పదవి కలిగి ఉండాలి, లేదా ఆ పదవులపై కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
3. మున్సిపాలిటీ ఉన్నటువంటి రెవెన్యూ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్/ఉప సర్పంచ్/వార్డు మెంబర్ పదవి కలిగి ఉండాలి, లేదా ఆ పదవులపై కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
4. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ 3 సంవత్సరాలు కాల వ్యవధిలో పనిచేసిన అధ్యక్షులు అయి ఉండాలి.
5. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో గెజిటెడ్ పోస్టు యందు పనిచేసి రిటైర్ అయిన వారై ఉండాలి.
అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభ్యులకు:
1. మున్సిపల్ కౌన్సిల్ ఓటరు జాబితాలో రిజిస్టర్ అయి ఉండాలి.
2. వయసు 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి.
3. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వారై ఉండాలి.
అర్హతలు కలిగిన వారు తమ దరఖాస్తులతో పాటు అర్హతలకు సంబంధించిన రుజువులు జతచేసి 01-05-2026 సాయంత్రం 5.00 గంటల లోపు కమిషనర్, పురపాలక సంఘ కార్యాలయం, బాన్సువాడకు సమర్పించాలని కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు.
నోటీసును కార్యాలయ నోటీసు బోర్డు, ఆర్డీఓ, తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రచురిస్తారు.

.jpg)
Post a Comment