•నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్లు, 2BHK పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి
•పాల్గొన్న ప్రభుత్వ సలహా దారులు పోచారం, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి
తెలంగాణ డైలీ న్యూస్,హైదరాబాద్: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, 2BHK హౌసింగ్ పథకాల పురోగతిపై ఈరోజు సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది.
రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, హౌసింగ్ ఎండీ గౌతమ్, సంబంధిత ఎమ్మెల్యేలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు:
1. వేగవంతం: ఇందిరమ్మ ఇండ్లు, 2BHK పథకాల అమలును వేగవంతం చేసి అర్హులైన పేదలకు సమయానికి గృహాలు అందేలా చర్యలు చేపట్టాలి.
2. పారదర్శకత: లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలి.
3. నాణ్యత: నిర్మాణ పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదు. ప్రతి దశలో క్వాలిటీ చెక్ చేయాలి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ స్వప్నాన్ని సాకారం చేయడంలో కట్టుబడి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు, 2BHK పథకాలు సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకువస్తాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలి" అని స్పష్టం చేశారు.



Post a Comment