వాహనదారులకు మరో షాక్!
ఐదు రోజుల్లో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణ డైలీ న్యూస్, హైదరాబాద్: వాహనదారులపై భారం మరింత పెరిగింది. చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. గత ఐదు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. పెట్రోల్ లీటర్పై 86 పైసలు, డీజిల్ లీటర్పై 83 పైసలు పెరిగాయి. మొన్నటి వరకూ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో పెట్రోల్ ఉత్పత్తుల ధరలను కేంద్రం పెంచలేదు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో నే అనేక దేశాలు పెట్రోలు ధరలను పెంచాయి. కానీ మన దేశంలో పెంచలేదు. పెంచితే ఎన్నికల్లో బిజెపి పట్ల వ్యతిరేకత వస్తుందని వ్యూహత్మకంగా వ్యవహారించి, ప్రస్తుతం రెండు సార్లు పెంచడం గమనార్హం.
ప్రధాన నగరాల్లో తాజా ధరలు:
- *హైదరాబాద్*: పెట్రోల్ రూ.111.77, డీజిల్ రూ.99.89
- *విజయవాడ*: పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17
- *ఢిల్లీ*: పెట్రోల్ రూ.97.77, డీజిల్ రూ.90.67
- *ముంబై*: పెట్రోల్ రూ.106.68, డీజిల్ రూ.93.67
- *చెన్నై*: పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.95.25
ధరల పెరుగుదలకు కారణం:
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లకు పైగా కొనసాగుతోంది. పశ్చిమ ఆసియా సంఘర్షణతో కీలక సముద్ర వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురైంది. దీంతో ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
అయితే ఇంధన కొరత లేదని, దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రపంచవ్యాప్త అంతరాయాలు ఉన్నా స్థిరమైన ఇంధన ధరలు, నిరంతర సరఫరాలు కొనసాగిస్తున్నామని, దేశీయ ఎల్పిజి ఉత్పత్తిని పెంచామని ఆయన మే 12న పేర్కొన్నారు.
ఇటీవలే లీటర్కు 3 రూపాయలు పెంచిన కేంద్రం, నాలుగు రోజుల్లోనే మళ్లీ ధరలు పెంచడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ తర్వాత ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
గమనిక: జీఎస్టీ, ఇతర ఛార్జీలను బట్టి ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.


إرسال تعليق