ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయాలి: సీపీ సాయి చైతన్య
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, నిజామాబాద్, జూన్ 25: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం కోటగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పీఎస్లోని వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును సమీక్షించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
రికార్డులను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచించారు.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రామాల్లోని సమాచారాన్ని పైస్థాయి అధికారులకు చేరవేయాలన్నారు.
ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నందున వాహనాల రాకపోకలపై ఎల్లప్పుడూ నిర్విరామంగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతున్నారని, అప్పులు చేసి తీర్చలేక తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది 24x7 తమ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎసిపి పి. శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, కోటగిరి ఎస్ఐ జి. శ్రీనివాస్ యాదవ్, సిబ్బంది సీపీ వెంట ఉన్నారు.

Good information
ReplyDeletePost a Comment