జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులకు సన్మానం
రోగుల పట్ల మానవత్వంతో సేవలందించాలి: కలెక్టర్ సూచన
కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్:
అన్ని వృత్తుల్లో వైద్య వృత్తి అత్యంత గొప్పదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ సమాజానికి అమూల్యమైన సేవలు అందిస్తున్న వైద్యుల సేవలు ఎనలేనివని కొనియాడారు.
బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా వైద్యాధికారులను సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. వైద్యులు తమ జ్ఞానం, నైపుణ్యం, సేవాభావంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని అన్నారు.
రోగుల పట్ల మానవత్వం, సహానుభూతితో వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు నిరంతరం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటి, డీసీహెచ్ఎస్ఓ గోపాల్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment