బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి బోర్లం గ్రామంలో SIR ప్రోగ్రెస్ పరిశీలన
BLO లతో చర్చలు - ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పురోగతిని బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన బోర్లం గ్రామంలో పర్యటించి SIR పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. గ్రామంలోని BLO లతో సమావేశమై ఇప్పటి వరకు ఎన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ సేకరించారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
ఈ సందర్భంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ SIR ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అపోహలు లేకుండా అవగాహన కల్పించాలని BLO లను ఆదేశించారు.
గతంలో ఓటు వేసిన వారు కూడా తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫామ్ నింపాల్సిందేనని, లేకుంటే ఓటు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉందని ప్రజలకు వివరించాలన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఫామ్స్ సేకరించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ఈ నెల 24వ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు కూడా తమ ఇళ్లకు వచ్చే BLO, BLA లకు పూర్తి సహకారం అందించాలని ఆర్డీఓ కోరారు.




Post a Comment