RDOకు వినతి పత్రం అందజేసిన ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ
తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి :
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను తిరిగి ఎల్లారెడ్డిలోనే కొనసాగించాలని ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ సభ్యులు రెవెన్యూ డివిజనల్ అధికారి RDOకు వినతి పత్రం అందజేశారు.
సోమవారం ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్ నేతృత్వంలో సభ్యులు RDOను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ఆరు సంవత్సరాలుగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో విజయవంతంగా కొనసాగుతున్న ఈ కళాశాల, ఎల్లారెడ్డి మరియు పరిసర ప్రాంతాల మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు.
అయితే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలను లింగంపేట్ మండల కేంద్రానికి తరలించడంతో స్థానిక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థులు చదువును కొనసాగించడంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎల్లారెడ్డి మండలానికి మంజూరు చేసిన ఈ కళాశాలను అదే కేంద్రంలో కొనసాగిస్తే స్థానిక మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను సులభంగా అభ్యసించే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాశాల తరలింపు వల్ల విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంతో పాటు, ప్రభుత్వ లక్ష్యమైన మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల అభిప్రాయాలు మరియు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, 2026-27 విద్యా సంవత్సరం నుంచే కళాశాలను తిరిగి ఎల్లారెడ్డిలో కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. తమ వినతిని సానుకూలంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు షేక్ గయాసుద్దీన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ మీర్, ముఖర్రం అలీ, సభ్యులు అహమ్మద్, సాదిక్, వాజిద్, జియా తదితరులు పాల్గొన్నారు.


Post a Comment