దేవునిపల్లి పోలీసుల చాకచక్యం
వరుస ఆస్తి నేరాల నిందితుడు అరెస్ట్
వివిధ కేసులకు చెందిన చోరీ సొత్తు స్వాధీనం
జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బృందానికి అభినందనలు
కామారెడ్డి: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన షాప్ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. వరుస ఆస్తి నేరాలకు పాల్పడుతున్న అలవాటు నేరస్థుడిని అరెస్ట్ చేసి, వివిధ కేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాలు
ఫిర్యాదుదారుడు తేలు రమేష్ 42, క్యాసంపల్లి గ్రామం, కామారెడ్డి మండలం నివాసి. ఆయన ఉగ్రవాయి గ్రామ శివారులోని మైసమ్మ గుడి సమీపంలో ఎస్వీ బేకరీ అండ్ టీ టైమ్ షాప్ నిర్వహిస్తున్నారు.
11.07.2026 తేదీన రాత్రి 10:45 గంటలకు షాపును మూసివేసి తాళం వేసి ఇంటికి వెళ్లారు. 12.07.2026 ఉదయం 8:00 గంటలకు షాపు తెరవడానికి రాగా, షట్టర్ తాళం పగులగొట్టబడి ఉంది. లోపల పరిశీలించగా కౌంటర్ డ్రాలో ఉంచిన రూ.4,000 నగదు, సిగరెట్ ప్యాకెట్లు, టీ ప్లాస్క్, సౌండ్ బాక్స్ తో పాటు మరికొన్ని కిరాణా వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు.
ఈ మేరకు ఫిర్యాదు అందిన వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, దేవునిపల్లి ఎస్హెచ్ఓ రంజిత్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
దర్యాప్తులో భాగంగా 17.07.2026 తేదీన టేక్రియాల్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తంగళ్లపల్లి కనకరాజు @ రాజు 41, తండ్రి సత్తయ్య, ఉప్పరపల్లి గ్రామం, బీబీపేట్ మండలం గా గుర్తించారు.
నిందితుడు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీ బేకరీ అండ్ టీ టైమ్ షాపులో రాత్రి సమయంలో షట్టర్ తాళం పగులగొట్టి చోరీ చేసినట్లు అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు:
ఒక యాక్సెస్ స్కూటీ
ఒక హోండా షైన్ మోటార్ సైకిల్
55 గోల్డ్ ఫ్లాక్ సిగరెట్ ప్యాకెట్లు
ఒక టీ ప్లాస్క్
ఒక జీపాస్ సౌండ్ బాక్స్
రెండు సర్ఫ్ డిటర్జెంట్ ప్యాకెట్లు
రెండు గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్లు
ఒక ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్
15 చిన్న కొబ్బరి నూనె బాటిల్స్
3 పెద్ద కొబ్బరి నూనె బాటిల్స్
చోరీకి ఉపయోగించిన ఒక ఇనుప రాడ్డు
రెండు మొబైల్ ఫోన్లు
నిందితుడి నేర చరిత్ర
దర్యాప్తులో నిందితుడు గతంలో బీబీపేట్, మెదక్ ప్రాంతాలలో పలు ఆస్తి నేరాలకు పాల్పడిన అలవాటు నేరస్థుడని తేలింది. అలాగే రామాయంపేట, దోమకొండ, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన వాహన చోరీ, సెల్ ఫోన్ చోరీ కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది.
నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన దేవునిపల్లి ఎస్హెచ్ఓ రంజిత్ మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, వ్యాపార సంస్థలు, నివాస గృహాలు, వాహనాలకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

Post a Comment