కామారెడ్డిలో సంచలనం సృష్టించిన అవినీతి ఘటన
బాధితుడి ఫిర్యాదుతో రెడ్హ్యాండెడ్గా పట్టివేత
కామారెడ్డి, ఆగస్టు 20: కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానంటూ లంచం డిమాండ్ చేసిన రాజంపేట ఎస్ఐ ఏసీబీ వలలో చిక్కారు. గురు వారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
రాజంపేట మండలంలో సిమెంట్ షాపుకు సంబంధించి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అనుమతి లేకుండా మరో కంపెనీ సిమెంట్ దించుతున్నారంటూ ఫిర్యాదు అందడంతో పోలీసులు రెండు వర్గాలపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక వర్గానికి చెందిన వ్యక్తి స్టేషన్ బెయిల్ కోసం ఎస్ఐను కలిశాడు. వీడియో 👇
బెయిల్ ఇప్పిస్తానని చెప్పిన ఎస్ఐ, అందుకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే ఏసీబీ అధికారులు పథకం రచించారు. ఎస్ఐ చెప్పిన ప్రకారం బాధితుడు కామారెడ్డిలోని ఎస్ఐ ఇంటికి వెళ్లి 30 వేలు అందజేశాడు. డబ్బు చేతిలోకి తీసుకున్న వెంటనే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు ఎస్ ఐ ను అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
ప్రజలకు సేవ చేయాల్సిన పోలీస్ అధికారే లంచానికి పాల్పడటంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Post a Comment