నారాయణఖేడ్ టౌన్ NH-161(B) రహదారి విస్తరణ పనులను వెంటనే మంజూరు చేయాలి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ సురేష్ షెట్కార్ లేఖ
జహీరాబాద్ / న్యూఢిల్లీ:
తెలంగాణ సరిహద్దు నుండి బీదర్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న NH-161(B) జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా, నారాయణఖేడ్ పట్టణ పరిధిలో మిగిలిపోయిన రహదారి విస్తరణ పనులను వెంటనే మంజూరు చేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు.
గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి, ఈ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
లేఖలోని ముఖ్యాంశాలు:
1. పట్టణ పరిధిలో ఇరుకైన రహదారి
నిజాంపేట్-నారాయణఖేడ్-బీదర్ రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ టౌన్ పరిధిలోని 4.50 కి.మీ నుండి 8.00 కి.మీ వరకు గల రహదారిని ఈ ప్రాజెక్టులో చేర్చలేదు. దీనివల్ల పట్టణంలో నిత్యం తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
2. ప్రజల ఇబ్బందులు - ప్రమాదాలు
ఈ ఇరుకైన రోడ్డు కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.
3. సమగ్ర అభివృద్ధికి వినతి
ఈ మిగిలిపోయిన 3.5 కి.మీ భాగాన్ని కూడా ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, సెంట్రల్ లైటింగ్ మరియు ఆధునిక డ్రైనేజీ వ్యవస్థతో విస్తరించాలని ఎంపీ కోరారు. ఈ పని పూర్తయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మరింత సులువు అవుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సాంకేతిక పరిశీలనను త్వరితగతిన పూర్తి చేసి, నిధులు మంజూరు చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

Post a Comment