మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
బాధితులతో గౌరవంగా వ్యవహరించి తక్షణ పరిష్కారం చూపాలి - ఎస్పీ రాజేష్ చంద్ర
డయల్-100 కాల్స్కు వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 3: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఈరోజు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై విధుల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితులు, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్షించారు.
బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
ఉన్నతాధికారుల ఆదేశాలపై సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని ఎస్పీ సూచించారు. బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సస్పెక్టుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, గస్తీ, పేట్రోలింగ్ను మరింత పటిష్టం చేయాలన్నారు.
ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యం
శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై ముందస్తు సమాచారం సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమాచారం ఆధారంగా నేరాలను ముందుగానే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో, బాధ్యతతో పనిచేయాలన్నారు.
డయల్-100కు తక్షణ స్పందన
డయల్-100 కాల్స్ అందిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, అప్పగించిన విధులను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కామారెడ్డి–సిరిసిల్ల రాష్ట్ర రహదారి ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి నివారణ చర్యలు అమలు చేయాలని, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
విలేజ్ పోలీసింగ్ బలోపేతం
విలేజ్ పోలీసింగ్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై పనిచేయాలని, నేరాల నివారణలో చురుకైన పాత్ర పోషించాలన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన
సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా యువతకు సైబర్ భద్రత, ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ గారు సూచించారు.



Post a Comment