ధాబాల్లో సిట్టింగులపై పోలీసుల ప్రత్యేక నిఘా
దాబాలో బైండోవర్ ఉల్లంఘనపై కఠిన చర్యలు
రూ.15 వేల జరిమానా, రూ.1 లక్షకు మళ్లీ బైండోవర్
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎస్పీ రాజేష్ చంద్ర
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగులపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS స్పష్టం చేశారు.
గతంలో హెచ్చరికలు, బైండోవర్
పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని సంతు దాబా యజమాని రాథోడ్ సంతోష్ పై చర్యలు తీసుకున్నారు.
గతంలో 30-08-2025న దాబాలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించరాదని హెచ్చరిస్తూ, పిట్లం ఎస్ఐ ద్వారా ఎమ్మార్వో సమక్షంలో రూ.50,000 బైండోవర్ ఒక సంవత్సరం కాలపరిమితో అమలు చేశారు.
మళ్లీ ఉల్లంఘన గుర్తింపు
అయినప్పటికీ 17-05-2026న అదే దాబాలో మళ్లీ అక్రమంగా మద్యం సిట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి అక్రమ కార్యకలాపాలను గుర్తించారు. గతంలో విధించిన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 10-07-2026న పిట్లం ఎస్ఐ ఆంజనేయులు ఎమ్మార్వో సమక్షంలో రాథోడ్ సంతోష్పై రూ.15,000 జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా రూ.1,00,000 మొత్తానికి మళ్లీ బైండోవర్ చేయించారు.
ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలోని అన్ని దాబా యజమానులు తమ దాబాల్లో అక్రమ మద్యం విక్రయాలు, సిట్టింగులు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఒకసారి బైండోవర్ చేసిన తరువాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, భారీ మొత్తాలకు బైండోవర్ చేయడం, చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు జిల్లావ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయన్నారు.

Post a Comment