బీర్కూర్ లో గుర్తు తెలియని వ్యక్తి దాడి
7 నెలల చిన్నారికి తీవ్ర గాయాలు
కామారెడ్డి: బీర్కూర్ లో గుర్తు తెలియని వ్యక్తులు తండ్రి పక్కన నిద్రిస్తున్న 7 నెలల చిన్నారిని అపహరించి బ్లేడ్ తో ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. అనంతరం చిన్నారిని చెట్టు పాదల్లో పడేశారు.
ఘటన వివరాలు
బీర్కూర్ ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీష్, సంధ్య దంపతులకు వైష్ణవి 7 నెలల కుమార్తె ఉంది. మంగళవారం రాత్రి 7:30 గంటలకు తండ్రి సతీష్ కుమార్తెతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రపోయాడు. రాత్రి 8 గంటలకు కుమార్తె కనిపించకపోవడంతో భార్య వద్ద ఉందని భావించి అక్కడే నిద్రపోయాడు.
తిరిగి బుధవారం ఉదయం 5 గంటలకు నిద్ర లేచిన సతీష్ పాప గురించి భార్య, తల్లిని అడిగాడు. వారు తమ వద్ద లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చెట్టు పాదల్లో గాయాలతో చిన్నారి
అనంతరం స్థానికులు, బంధువులు కలిసి చిన్నారి కోసం గాలించారు. గోసంగి సంఘ భవనం సమీపంలోని ఒక పాదల్లో చిన్నారి స్పృహ కోల్పోయి కనిపించింది. చిన్నారి ఒళ్లంతా బ్లేడ్ తో చేసిన గాయాలు ఉన్నాయి.
వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం బాన్సువాడకు అక్కడి నుండి నిజామాబాద్ కు తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఈ సంఘటన పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
=====================
నిజాంసాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి
కామారెడ్డి: నిజాంసాగర్ మండలం మాగి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి నిలబడకుండా వెళ్లిపోయింది.
ప్రమాదం ఎలా జరిగింది
నిజాంసాగర్ మండలం గొర్గల్ గ్రామానికి చెందిన దినేష్ (26), రమేష్ (24) పిట్లం నుండి బైక్ పై స్వగ్రామానికి వస్తున్నారు. వడ్డేపల్లి గ్రామ శివారుకు చేరుకునే సమయంలో ఎదురుగా వచ్చిన తెలియని వాహనం వారి బైక్ ను బలంగా ఢీకొట్టింది.
ఇద్దరి మృతి
ఈ ఘటనలో దినేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన రమేష్ ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స కోసం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో రమేష్ కూడా మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
≠=======================
బాన్సువాడ డివిజన్ లో మైనర్ బాలిక ప్రసవం
పుట్టిన బిడ్డ మృతి చెందిన ఘటన
కామారెడ్డి: బాన్సువాడ డివిజన్ లోని ఓ మండలంలోని ఒక గ్రామానికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలిక ఆసుపత్రిలో ప్రసవించింది. పుట్టిన మగ బిడ్డ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బాలుడిపై పోక్సో కేసు నమోదు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు బాలికకు మాయ మాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. గత నెల 6న బాలుడిని బాల నేరస్థుల శిక్షణ కేంద్రానికి తరలించారు. బాలికను జిల్లా బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఆసుపత్రిలో ప్రసవం
బాలిక 7 నెలల గర్భవతిగా ఉంది. ఇటీవల ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. 14వ తేదీన చికిత్స పొందుతున్న సమయంలో నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం తల్లి ఆరోగ్యంగా ఉందని పోలీసులు వెల్లడించారు.


Post a Comment