ఎల్లారెడ్డిలో విద్యుత్ కోతలపై RDO కు వినతి
"తక్షణ పరిష్కారం చూపాలి": మాజీ జెడ్పిటిసి షేక్ గయాజుద్దీన్ డిమాండ్
ఎల్లారెడ్డి: గత వారం రోజులుగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కొనసాగుతున్న తరచు విద్యుత్ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని కోరుతూ మాజీ జెడ్పిటిసి షేక్ గయాజుద్దీన్ సోమవారం RDO ప్రభాకర్కు వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ కోతలతో ప్రజా అవస్థలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతర విద్యుత్ అంతరాయాల వల్ల విద్యార్థులు, వృద్ధులు, వ్యాపారులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఇటీవల విద్యుత్ కోతలతో ఏర్పడిన ఉక్కపోత కారణంగా ఎల్లారెడ్డికి చెందిన ఒక క్యాన్సర్ రోగి మృతి చెందిన ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ప్రజల ప్రాణ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనవసర విద్యుత్ కోతలను నివారించాలని RDO ప్రభాకర్ను విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన RDO ప్రభాకర్ సమస్యను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Post a Comment