బాన్సువాడలో SIR నోటీసుల వెల్లువ - మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల సందడి
పట్టణంలో ఏకంగా 7500 నోటీసులు
నిర్ణీత గడువులోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి : మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్
బాన్సువాడ, ఆగస్టు 31:
భారత కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) పనులు వేగంగా జరుగుతున్నాయి. బాన్సువాడలో SIR పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి.
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 వేలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేయగా, కేవలం బాన్సువాడ పురపాలక కేంద్రంలోనే మొత్తం 24 వేల ఓట్లకు గాను దాదాపు 7500 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. 2002 ఓటర్ జాబితాతో పేర్లు సరిపోలకపోవడం, పేర్లలో తప్పులు, తేడాలు ఉండటమే దీనికి కారణం. అలాగే ఐదుగురి కంటే అధికంగా మ్యాపింగ్ అయిన వారికి సైతం నోటీసులు జారీ చేశారు. ఆయా పోలింగ్ బూత్ ల వారీగా BLO లు నోటీసులు పంపిణీ చేస్తున్నారు.
నోటీసులు అందుకున్న వారు నిర్ణీత గడువులోగా తమ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని, లేకపోతే ఓటర్ జాబితా నుండి పేర్లు శాశ్వతంగా తొలగించబడే ప్రమాదం ఉందని మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ హెచ్చరించారు.
నోటీసులతో మున్సిపల్ ఆఫీసులో ఓటర్ల రద్దీ నెలకొంది. ప్రతి వార్డు నుండి దాదాపు 300 మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా.
ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని, తమ బీఎల్ఓలను సంప్రదించి నోటీసుతో పాటు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని, మరింత సమాచారం కోసం కాలనీ కౌన్సిలర్ లేదా స్థానిక నాయకులను సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.




Post a Comment