Drunk And Drive Cases | జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

 

👉నలుగురికి ఒక రోజు జైలు, మరో నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష, మొత్తం ₹75,000/- జరిమానా విధింపు

👉ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే

👉క్షణికానందం కోసం సేవించిన మద్యం.. కుటుంబం వీధి పాలు

👉జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర  వెల్లడి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం నిర్వహిస్తున్న డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 58 మందికి న్యాయస్థానం జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించింది. ఇందులో 4 మందికి ఒక రోజు జైలు శిక్ష, మరో 4 మందికి రెండు రోజుల జైలు శిక్ష విధించగా, మొత్తం ₹75,000/- జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే” అని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు. “ప్రమాదం ముందస్తుగా చెప్పి రాదు” అనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు.

మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని, క్షణికానందం కోసం చేసే తప్పు కుటుంబాలను చీకటిలోకి నెడుతుందని హెచ్చరించారు. మీ కుటుంబ క్షేమం కోసమైనా మద్యం సేవించి వాహనం నడపవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ గారు ప్రజలకు పిలుపునిచ్చారు.

Post a Comment

Previous Post Next Post