[ఫోటో: బిచ్కుంద తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతులు]
•జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఆందోళన
•తహసిల్దార్ హామీతో విరమణ
తెలంగాణ డైలీ న్యూస్, బిచ్కుంద : జొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట గురువారం రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు.
చేతికి వచ్చిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్ధిపేట, గాంధారి తదితర ప్రాంతాల్లో గత 15 రోజులుగా కొనుగోలు ప్రక్రియ నడుస్తుండగా, జుక్కల్ నియోజకవర్గంలో ఎందుకు ప్రారంభించలేదని రైతులు ప్రశ్నించారు. రైతులు రోడ్లెక్కేదాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయరా అంటూ అధికారులను నిలదీశారు.
ఒక ఎకరానికి 25 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని రైతులు కోరారు. కొనుగోలుపై ప్రభుత్వం నుండి స్పష్టత రాని పక్షంలో జిల్లా స్థాయి వరకు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దీనిపై స్పందించిన తహసిల్దార్ బి. వేణుగోపాల్ గౌడ్ రైతులతో మాట్లాడి సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

Post a Comment