•బాన్సువాడ ఆసుపత్రిలో మానవత్వం – వీడ్కోలులో కన్నీళ్లు
•వారం రోజులు కన్నబిడ్డలా చూసుకున్న నర్సులు
•శిశు సంరక్షణ శాఖకు అప్పగిస్తుండగా భావోద్వేగం
తెలంగాణ డైలీ న్యూస్,బాన్సువాడ:
మదీనా కాలనీలో తల్లిదండ్రులు వదిలివెళ్లిన ఒక శిశువుపై బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్య సిబ్బంది చూపిన మమకారం అందరి హృదయాలను కదిలించింది.
(Video 👆)
అమ్మ ఒడిలా ఆసుపత్రి:
వారం క్రితం మదీనా కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువు ను వదిలివెళ్లగా, కాలనీ వాసులు ఆ బాబు ప్రాణాలు కాపాడి, పోలీసులకు సమాచారం ఇవ్వగా, శిశువును పోలీసులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రి నర్సులు, వైద్య సిబ్బంది ఆ పసికందును కన్నబిడ్డలా చూసుకున్నారు. సమయానికి పాలు పట్టడం, వైద్యం అందించడం, నిద్రపుచ్చడం – ఏ లోటు లేకుండా ఎంతో ఆప్యాయతగా పెంచారు. దీంతో శిశువుపై సిబ్బందికి విపరీతమైన ప్రేమ ఏర్పడింది.
కన్నీటి వీడ్కోలు:
అయితే మంగళవారం శిశు సంరక్షణ శాఖ అధికారులు ఆసుపత్రికి వచ్చి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ్ కుమార్ నుంచి శిశువును అధికారికంగా తీసుకొని వెళ్లారు. వారం రోజులుగా తమ కళ్ల ముందే పెరిగిన ఆ పసివాడు దూరమవుతుండటంతో నర్సులు, సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో శిశువుకు వీడ్కోలు పలికారు. ఆ దృశ్యం చూసిన వారందరినీ కలచివేసింది.
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం:
“డ్యూటీలో భాగమే అయినా, ఆ పిల్లాడు మా అందరి మనసులకు దగ్గరయ్యాడు. వదిలి వెళ్తుంటే మా బిడ్డను పంపినట్టే అనిపించింది” అని ఓ నర్సు కన్నీటితో తెలిపారు. శిశువును ప్రస్తుతం శిశు సంరక్షణ శాఖ అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఆసుపత్రి సిబ్బంది చూపిన ఈ మానవత్వం, వారి ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలిచింది.




Post a Comment