#42 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రత
#బయటకు వెళ్ళవద్దని వైద్యుల సూచనలు
(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల్లో తిరిగితే వడదెబ్బ తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవాళ్టి నుంచి ఎండ తీవ్రత మరింత పెరగనుంది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) సూచనల ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. నిన్న కడపలో గరిష్ఠంగా 44.4°C ఉష్ణోగ్రత నమోదైంది. నేడు (ఏప్రిల్ 14, 2026) రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం సహా పలు జిల్లాల్లోని 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
![]() |
| కామారెడ్డి జిల్లా లో మండలాల వారీగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రతలు |
మరోవైపు తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటేశాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 42.8°C నమోదైంది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3°C పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దాదాపు 29 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41°C కి పైగా నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లా లో సోమవారం 42 డిగ్రీలు దాటింది. వేడి గాలుల ప్రభావం పెరగనుండటంతో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎండల నుండి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించడం మరియు కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండటం అవసరం.
.jpeg)
.jpeg)

Post a Comment