•ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
•స్లాబ్ పూర్తయిన ఇళ్లలో వెంటనే గృహప్రవేశాలు, ఇసుక కొరత లేకుండా చూడాలని ఆదేశం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎంపీడీవోలు, జిల్లా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్లాబ్ పూర్తయిన, నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న ఇళ్లలో వెంటనే లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించాలని సూచించారు. శాంక్షన్ అయిన అన్ని గృహాలకు తక్షణమే మార్కౌట్ ఇవ్వాలని, మార్కౌట్ పూర్తయిన గృహాలకు బేస్మెంట్ పనులు వేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా లబ్ధిదారులకు సులభంగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ప్రతి అర్హుడికి ఇల్లు అందేలా చూడాలని, ఏ దశలోనూ పనులు ఆలస్యం కాకుండా ఎంపీడీవోలు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
అదేవిధంగా ప్రతి మండలంలో ఒక హాస్టల్ను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మధుమోహన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి విజయపాల్ రెడ్డి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Post a Comment