మేడిపల్లి విద్యార్థి అనిల్ కుమార్కు అరుదైన ఘనత - నీట్లో ఎంబీబీఎస్ సీటు కైవసం
హ్యూమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం - తాత కృషికి అభినందనలు
గాంధారి, సెప్టెంబర్ 14: గాంధారి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి పొట్టకూరి అనిల్ కుమార్ నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా హ్యూమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్, బాన్సువాడ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పొట్టకూరి సాయిలు మనవడు అయిన అనిల్ కుమార్ తల్లిదండ్రులు లేకున్నా, తాత సాయిలు అన్నీ తానై అన్ని విధాలుగా సహకరిస్తూ విద్యలో ప్రోత్సహించారని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు హాఫిజ్ షకీల్ అహ్మద్ మాట్లాడుతూ, అనిల్ కుమార్ సాధించిన ఈ విజయం వెనుక ఆయన తాత పొట్టకూరి సాయిలు గారి కృషి ఎంతో ఉందన్నారు. తాను పడ్డ కష్టం తన మనవళ్లు పడకూడదనే ఉద్దేశంతో ఎంతో కృషితో పిల్లలను ముందుండి నడిపించారని, ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనిల్ కుమార్ భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు సాధించి గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ముహమ్మద్ ఆరిఫ్, షేక్ సమీర్, షేక్ రియాజ్, హాఫిజ్ ఇంతేజార్, హాఫిజ్ అబ్దుల్ లతీఫ్, గ్రామ సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్, గ్రామ జనతా యూత్ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని అనిల్ కుమార్ను అభినందించారు.

إرسال تعليق