Murder in KMR | భర్తను హత్య చేసిన భార్య

 


•కామారెడ్డిలో దారుణం 

•ఒక్క క్షణం కోపం 

•చిన్నారుల జీవితం అంధకారం

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో భార్య తన భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన శనివారం రాత్రి కలకలం రేపింది. అక్కడ రాత్రి వినిపించిన ఏడుపులు, కేకలు ఆ ఇంటి గోడలు దాటి వీధంతా పాకాయి. కారణం ఒక్క క్షణం కోపం. ఆ కోపం ఒక ప్రాణం తీసింది, మరో ప్రాణాన్ని జైలు ఊచల వెనక్కి నెట్టింది,  పిల్లలను అనాథలుగా మిగిల్చింది.

ఆ రాత్రి ఏం జరిగింది?  

కోదండ శివ రోజూలాగే పని ముగించుకొని ఇంటికొచ్చాడు. భోజనం చేస్తుండగా భార్య లక్ష్మితో మాట మాట పెరిగింది. చిన్న గొడవ. ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ ఆ రోజు మాత్రం అక్కడే ఉన్న కొడవలి అందుకునేలా లక్ష్మిని కోపం ప్రేరేపించింది. ఒక్క వేటు. శివ కుప్పకూలాడు. వంటింట్లో అన్నం పళ్లెం, నేలపై రక్తం, మూలన నిలబడి వణికిపోతున్న ఇద్దరు పసిపిల్లలు.

ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి?

"అయ్యా చచ్చిపోయిండు, అమ్మను పోలీసోళ్లు తీస్కపోయిండ్రు" అంటూ పిల్లలు ఇరుగుపొరుగు వారిని పట్టుకొని ఏడుస్తున్న దృశ్యం చూపరులను కలచివేసింది. తల్లిదండ్రుల మధ్య చిన్న గొడవ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. రేపటి నుంచి వాళ్లకు అన్నం పెట్టేదెవరు? స్కూల్‌కు పంపేదెవరు? 

పోలీసుల విచారణ  

సమాచారం అందిన వెంటనే పట్టణ సీఐ నరహరి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కోపంలో దాడి చేయడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

ఒక్క నిమిషం ఆగి ఆలోచించి ఉంటే, కోపాన్ని అదుపు చేసుకుని ఉంటే ఈ రోజు ఆ ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యేవారు కాదు. కుటుంబ కలహాలు ఎంత దూరం వెళ్తాయో చెప్పడానికి ఈ ఘటన ఒక విషాద ఉదాహరణ.

చిన్న గొడవతో....

గోసంగి కాలనీలో నివాసం ఉంటున్న కోదండ శివ రాత్రి భోజనం చేస్తుండగా భార్య కోదండం లక్ష్మితో చిన్నపాటి గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన లక్ష్మి అక్కడే ఉన్న కొడవలితో భర్తపై దాడి చేసి దారుణంగా హత్య చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితురాలు కోదండం లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టారు. స్థానికులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు.  మృతుడు కోదండ శివకు పిల్లలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post