కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్పై ఉక్కుపాదం
87 మందికి కోర్టు శిక్షలు - రూ.99 వేల జరిమానా వసూలు
13 మందికి జైలు శిక్ష - ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరిక
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 87 మందికి కోర్టు శిక్షలు విధించింది. మొత్తం రూ.99,000 జరిమానా వసూలు చేయగా, 13 మందికి జైలు శిక్ష పడింది.
జైలు శిక్షలు వివరాలు
ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి మొత్తం 87 మందిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి కలిపి రూ.99,000 జరిమానా విధించింది. అదనంగా 13 మందికి జైలు శిక్షలు విధించారు. అందులో 2 మందికి ఒక రోజు, 10 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించబడింది.
ఒక్క అజాగ్రత్త జీవితాంతం విషాదం - ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మాట్లాడుతూ “ప్రతిరోజూ మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ కుటుంబ సభ్యులు చెప్పే ‘జాగ్రత్తగా వెళ్లండి’ అనే మాటలో మీపై ఉన్న ప్రేమ, మీరు క్షేమంగా తిరిగి రావాలనే ఆశ దాగి ఉంటుంది. అయితే రోడ్డుపై చేసే ఒక చిన్న అజాగ్రత్త ఆ కుటుంబాన్ని జీవితాంతం విషాదంలోకి నెట్టివేస్తుంది. రోడ్డు ప్రమాదం అనేది కేవలం ఒక సంఘటన కాదు... అది ఒక తల్లి కన్నీరు, ఒక తండ్రి మౌనం, ఒక చిన్నారి జీవితాంతం మిగిలే బాధ” అని పేర్కొన్నారు.
మద్యం మత్తులో డ్రైవింగ్పై కఠిన చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు తప్పవని, ఇది వ్యక్తిగత భవిష్యత్తు, కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్పీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.
========================
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఏఎస్ఐలుగా హోదా చిహ్నాలు అలంకరించిన ఎస్పీ రాజేష్ చంద్ర
పదోన్నతులు బాధ్యతలను మరింత పెంచుతాయి - జిల్లా ఎస్పీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)లుగా పదోన్నతి పొందారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర వారికి నూతన హోదా చిహ్నాలను అలంకరించి అభినందించారు.
పదోన్నతి పొందిన అధికారులు
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన పండరి గౌడ్, తాడ్వాయి పోలీస్ స్టేషన్కు చెందిన వై. రాజేందర్లు హెడ్ కానిస్టేబుల్ హోదా నుంచి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎస్పీ గారు వారికి హోదా చిహ్నాలను అలంకరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
నిబద్ధతకు గుర్తింపు తప్పనిసరి - ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా, మరింత బాధ్యతాయుతమైన సేవలను అందించేందుకు అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖలో కష్టపడి, నిబద్ధతతో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం, పదోన్నతులు తప్పకుండా లభిస్తాయని ఎస్పీ తెలిపారు.
పదోన్నతి పొందిన అధికారులు తమ నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ శాఖకు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.




إرسال تعليق