నిరసనల కొత్త రూపం - నీట్ నుంచి జంతర్ మంతర్ వరకు!
ఒక పేపర్ లీక్, లక్షల మంది విద్యార్థుల కల చిద్రం
యువత(జెన్ జెడ్)గళం- సిస్టమ్ కి సవాల్?
ప్రధాన డిమాండ్ ఒక్కటే: విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఎట్టకేలకు విద్యమంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా
(✍️ఎస్ మోహియొద్దీన్, MA MCJ B.Ed)
(తెలంగాణ డైలీ న్యూస్)
2024 నుంచి 2026 వరకు భారతదేశ విద్యా వ్యవస్థ ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంది. ఆ పేపర్ నీట్ కాదు. అది ప్రజల నమ్మకానికి, ప్రభుత్వ జవాబుదారీతనానికి పెట్టిన పరీక్ష. ఫలితంగా వచ్చింది వీధుల్లో ఆగ్రహం, సోషల్ మీడియాలో సెటైర్, జెన్ జడ్ పూర్తిగా కొత్త తరహా నిరసనలు.
ఒక పేపర్ లీక్, లక్షల కల చిద్రం
నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ కావాలనే ప్రతి విద్యార్థికి ఇది గేట్వే. కానీ వరుసగా ప్రశ్న పత్రాలు లీక్ అవడం, అక్రమాల ఆరోపణలు, ఫలితాల్లో అనుమానాలు - ఇవన్నీ ఒకేసారి పేలడంతో లక్షల కుటుంబాల్లో నిరాశ నెలకొంది.
"రెండు సంవత్సరాలు కోచింగ్, అప్పులు చేసి ఫీజులు కట్టాం. చివరికి పేపర్ లీక్ అయ్యిందంటే మేము ఎక్కడికి వెళ్లాలి?" - ఇది జంతర్ మంతర్ వద్ద వినిపించిన ప్రతి రెండో విద్యార్థి మాట. ఎన్ టీ ఏ (NTA) పనితీరుపై, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో "నీట్ వద్దు" అనే డిమాండ్ మళ్లీ బలంగా వినిపించింది.
"కాకరోచ్ జనతా పార్టీ" ఆవిర్భావం
కోపాన్ని నవ్వుతో కొట్టడం_
ప్రభుత్వాలు మారవు, వ్యవస్థ మారదు, కానీ సమస్యలు మాత్రం బతికే ఉంటాయి. ఈ ఫ్రస్ట్రేషన్కు Gen Z పెట్టిన పేరే "కాకరోచ్ జనతా పార్టీ".
ఇది రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక మీమ్, ఒక ఉద్యమం, ఒక ఎద్దేవా.
పేపర్ లీక్ అయినా, రైల్వే ఉద్యోగాలు రాకపోయినా, ఫీజులు పెంచినా - "ఏమీ కాదు, మేము బతికే ఉంటాం" అనే సిస్టమ్ తీరును ఎగతాళి చేయడానికి ఈ పేరు పుట్టింది. ఇన్స్టా రీల్స్, ట్విట్టర్ మీమ్స్, కాలేజీ గోడలపై పోస్టర్లు - అన్నిట్లో ఈ పార్టీ "అభ్యర్థులు" కనిపించారు. కోపాన్ని నేరుగా చెప్పలేని చోట, సెటైర్ ఆయుధమైంది.
జంతర్ మంతర్ - ఢిల్లీ గుండెలో విద్యార్థుల గర్జన
నీట్ గందరగోళం పతాక స్థాయికి చేరినప్పుడు వేదిక అయింది ఢిల్లీ జంతర్ మంతర్. దేశం నలుమూల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు అక్కడికి చేరారు.
ప్రధాన డిమాండ్ ఒక్కటే: విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి....చివరకు రాజీనామా
"మా భవిష్యత్తుతో ఆడుకోవద్దు", "NTA రద్దు చేయండి", "పారదర్శక పరీక్షలు కావాలి" అంటూ నినాదాలు మార్మోగాయి. NSUI, AISA వంటి విద్యార్థి సంఘాలతో పాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వేదిక పంచుకున్నాయి. కానీ ముందు వరుసలో ఉన్నది మాత్రం సొంతంగా బ్యానర్లు చేసుకుని వచ్చిన సామాన్య విద్యార్థులే.
ప్రధాని స్పందన_: విద్యార్థుల ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ X పై స్వయంగా వీడియో విడుదల చేశారు. "విద్యార్థుల భవిష్యత్తుతో రాజీలేదు. దోషులను వదిలిపెట్టం" అని హామీ ఇచ్చారు. కానీ "ఈ నిరసనల వెనుక రాజకీయ కుట్ర ఉంది" అనే వ్యాఖ్యలు మళ్లీ వివాదానికి దారితీశాయి. ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది విద్యార్థుల విజయమని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ పేర్కొన్నారు.
![]() |
| విద్యా మంత్రి రాజీనామా చేశాక నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పోస్టర్ ను ప్రదర్శిస్తున్న అభిజీత్ దీప్కే |
సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమణ: లడఖ్ విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ ఢిల్లీలో 26 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను కేంద్ర మంత్రుల బృందం హామీలతో విరమింపజేసింది. 6వ షెడ్యూల్ అమలు, లడఖ్కు ప్రత్యేక విద్యా విధానం పై చర్చకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. వాంగ్చుక్ "ఇది విరామం మాత్రమే, పోరాటం ఆగదు" అన్నారు.
ఈ మూడు సంఘటనలు ఒకటే చెప్తున్నాయి - యువత నిరసన ఇక క్యాంపస్లకు పరిమితం కాలేదు. అది ప్రధాని ట్విట్టర్ టైమ్లైన్ను, కేంద్ర మంత్రివర్గ సమావేశాలను కూడా కదిలిస్తోంది.
Gen Z నిరసన - అరవడం కాదు, ఆలోచింపజేయడం, ఈ తరం నిరసన వేరు. లాఠీలకు, అరెస్టులకు భయపడేది కాదు. ట్రెండ్ చేసేది.
డిజిటల్ ఫస్ట్_: #NEETScam, #PaperLeak, #ResignDharmendraPradhan హ్యాష్ట్యాగ్లు 24 గంటల్లో మిలియన్ల రీచ్. PM వీడియోకు కూడా కామెంట్లలో లక్షల "జవాబు కావాలి" రిప్లైలు
- సింబాలిక్ ప్రొటెస్ట్_: రోడ్డు మధ్యలో బెంచీలు, టేబుళ్లు వేసి "రోడ్డుపైనే పరీక్ష" అని కూర్చోవడం. పుస్తకాలతో మానవహారం
- కంటెంట్ వార్_: తీవ్రమైన అంశాన్ని 30 సెకన్ల రీల్లో, ఒక మీమ్లో చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లడం
"మేము విధ్వంసం చేయం. కానీ మిమ్మల్ని నిద్రపోనివ్వం" - ఇది Gen Z నిరసనల సారాంశం.
ముస్లింలు, వెనుకబడిన వర్గాల గొంతు ఈ ఉద్యమం కేవలం నీట్ కే పరిమితం కాలేదు. ముస్లిం విద్యార్థులు, SC, ST, OBC, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో కలిశారు.
కారణం స్పష్టం. కోచింగ్ ఫీజులు 2 లక్షలు, ఫారం ఫీజులు, ప్రయాణ ఖర్చులు - ఇవన్నీ ఆర్థికంగా బలహీన వర్గాలపై భారం. పైగా పేపర్ లీక్ అయితే మొదట దెబ్బ పడేది వారికే. అందుకే ఈ ఉద్యమంలో "సమాన అవకాశాలు", "రిజర్వేషన్ల సరైన అమలు", "మైనారిటీ విద్యాసంస్థలకు నిధులు" అనే డిమాండ్లు కూడా చేరాయి.
ట్రిగ్గర్ పేలింది, మార్పు మొదలైందా?
నీట్ పేపర్ లీక్ అనేది కేవలం ఒక సంఘటన. దాని కింద ఉన్నది చాలా పెద్దది - నిరుద్యోగం, అవినీతి, ప్రైవేటీకరణ, విద్యను వ్యాపారంగా చూడటం.
"కాకరోచ్ జనతా పార్టీ" పేరుతో నవ్వినా, జంతర్ మంతర్ లో అరిచినా, బంద్ పిలుపు ఇచ్చినా, Gen Z చేస్తున్నది ఒకటే: జవాబు అడుగుతున్నాం.
ప్రభుత్వం ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు,CBI విచారణలు, కఠిన చట్టాలు, మంత్రులతో చర్చలు అంటోంది. కానీ విద్యార్థులు అడుగుతున్నది చట్టాలు కాదు. నమ్మకం.
ఆ నమ్మకం తిరిగి రాకపోతే, ఇంకా కొత్తగా, ఇంకా బలంగా ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే ఈసారి వీధుల్లో ఉన్నది కోపం కాదు. ఒక తరం భవిష్యత్తు.





إرسال تعليق