అంతర్జాతీయ స్థాయికి ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యు.ఆర్. విద్యార్థిని ప్రతిభ
హైదరాబాద్ యాచ్ క్లబ్ శిక్షణతో ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కు ఎంపికైన రిశ్విత
తెలంగాణకు కీర్తి తెచ్చిన కామారెడ్డి బిక్నూర్ బిడ్డ
మంత్రి పొన్నం,అధికారుల అభినందనలు
కామారెడ్డి: కామారెడ్డి టౌన్ అజంపూర్ లోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల విద్యాలయం విద్యార్థిని అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బిక్నూర్ కు చెందిన ఎస్. రిశ్విత అంతర్జాతీయ తెర చాప పడవల క్రీడా పోటీలు (ఇంటర్నేషనల్ సెలింగ్ చాంపియన్ షిప్ ) ఛాంపియన్షిప్ - 2026 కు ఎంపికైంది. ఈ పోటీలు ఈ నెల 30 నుండి ఆగస్టు 7, 2026 వరకు జరగనున్నాయి.
శిక్షణ - సాధన
రిశ్విత తల్లిదండ్రులు ఎస్. శ్రీకాంత్, పద్మ. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన రిశ్విత గతంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ ప్రదర్శించి గోల్డ్, సిల్వర్ పతకాలు గెలుచుకుంది. ఆ ప్రతిభతోనే ఇప్పుడు అంతర్జాతీయ పోటీల్లో స్థానం సంపాదించింది.
అంతర్జాతీయ మెడల్స్ సాధించేందుకు కృషి చేస్తానని రిశ్విత పేర్కొన్నారు. విద్యార్థిని ప్రతిభను గుర్తించి ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యు.ఆర్ సొసైటీ తరపున అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా సహకరించినందుకు సెక్రటరీ బి. సైదులుకి ప్రిన్సిపాల్ పి. మాధవి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి పొన్నం,అధికారుల అభినందనలు
ఈ సందర్భంగా బి.సి. సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, సెక్రటరీ బి. సైదులు, ప్రిన్సిపాల్ సెక్రటరీ బాల మాయాదేవి, ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి.మాధవి విద్యార్థిని అభినందించారు.
రిశ్విత ఇలాగే పట్టుదలతో, కృషితో దేశానికి మరిన్ని ప్రశంసలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల నుంచి ఒక విద్యార్థిని అంతర్జాతీయ పోటీలకు వెళ్లడం కామారెడ్డి జిల్లాకు, తెలంగాణకు గర్వకారణంగా మారింది.



إرسال تعليق