కరీంనగర్ కార్పొరేషన్ కో-ఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్
ఐదింటికి ఐదు స్థానాలను కైవసం
చక్రం తిప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్
తెలంగాణ డైలీ న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్లో జరిగిన కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ ఐదింటికి ఐదు స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహంతో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
నిలువునా చీలిన బీఆర్ఎస్
ఓటింగ్లో బీఆర్ఎస్ డీలా పడింది. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. మొత్తం 38 మంది కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు జై కొట్టారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా, ఓటింగ్కు హాజరై బీఆర్ఎస్ భంగపడింది.
కార్యకర్తలకే పట్టం
కాషాయ జెండా మోసిన సామాన్య కార్యకర్తలకే పదవుల పట్టం కట్టారు. ఆచితూచి ఎంపిక చేయాలనే బండి సంజయ్ ఆదేశాలను ఎంపిక కమిటీ సభ్యులు పక్కాగా అమలు చేశారు. చెమట ఒడ్చిన కార్యకర్తలకే పదవులు దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో సంబురాలు నెలకొన్నాయి.
సామాజిక సమీకరణాలు
మైనార్టీ విభాగం: రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న ముజీబ్ తల్లికి అవకాశం కల్పించారు. మరో సీటులో సిక్కు సమాజానికి చెందిన బల్బీర్ సింగ్కు అవకాశం ఇచ్చారు. పార్టీని నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న బల్బీర్ సింగ్కు పదవి రావడంతో సిక్కులు సంతోషం వ్యక్తం చేశారు.
నిరుపేదకు పదవి: బొమ్మకల్ ప్రాంతానికి చెందిన అత్యంత సామాన్య కార్యకర్త, నిరుపేద అయిన నందన్ కుమార్కు కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించారు. కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేని నందన్ కుమార్ ఎంపికపై ఇతర పార్టీలు, ప్రజలు నిర్గాంతపోయారు.
ఎస్సీ మహిళా విభాగం: మాజీ కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేసిన చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మకు అవకాశం ఇచ్చారు.
వైశ్య వర్గం: పట్టణంలో మంచి పట్టున్న కన్నె కృష్ణకు అవకాశం కల్పించడంతో ఆర్యవైశ్యుల్లో ఆనందం నెలకొంది.
బీజేపీ కో-ఆప్షన్ సభ్యుల గెలుపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పదవుల పంపిణీలో సామాజిక సమీకరణాలు పాటించడంపై, సామాన్యులకు అవకాశం ఇవ్వడంపై ప్రజలు లోలోపల ప్రశంసలు కురిపిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఇతర పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.

Post a Comment