చోరీ చేసిన రెండు బైక్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
వాటర్ ప్లాంట్ కార్మికులే నిందితులు: సీఐ తుల శ్రీధర్
సిబ్బందిని అభినందించిన సీఐ
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 18: బాన్సువాడ పట్టణం, పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
నిందితుల వివరాలు
అరెస్టయిన నిందితులను బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయికుమార్ (20), నసురుల్లాబాద్ మండలం కామ్షెట్పల్లి గ్రామానికి చెందిన ఏనుగు నరసయ్య (19)గా గుర్తించారు. వీరిద్దరూ వేర్వేరు వాటర్ ప్లాంట్లలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
ఎలా పట్టుబడ్డారు?
ఈమధ్య కాలంలో బాన్సువాడ పట్టణం, పరిసర ప్రాంతాలలో వరుస ద్విచక్ర వాహనాలు చోరీ కావడంతో సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. వేర్వేరు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగించారు.
గురువారం ఉదయం బీర్కూర్ చౌరస్తాలో ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా వారు అకస్మాత్తుగా వాహనాన్ని మలుపుతిప్పి తప్పించుకునే యత్నం చేశారు. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
నేరం అంగీకారం, వాహనాలు స్వాధీనం
విచారణలో నిందితులు ఈ మధ్య రెండు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారు. వీరి వద్ద నుంచి టీఎస్ 16 ఈసీ 7090, టీఎస్ 16 ఈహెచ్ 8724 నంబర్లు గల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఐ నవీన్ చంద్ర, హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పాండురంగ, పృథ్వీరాజ్, సుదర్శన్ రావు లను పట్టణ సీఐ తుల శ్రీధర్ అభినందించారు.


Post a Comment