తక్షణమే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి... రైతుల ఇబ్బందులను పట్టించుకోండి
రిజర్వాయర్లు నింపేందుకు వెంటనే పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు లేఖ
సిద్ధిపేట, తెలంగాణ డైలీ న్యూస్ :వానాకాలం పంట సాగుకు సకాలంలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
రిజర్వాయర్లలో నీరు నింపకపోవడంతో రైతుల్లో ఆందోళన
రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకు సాగడం లేదని, దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, మరోవైపు ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అవసరం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, నరసింహ బస్వాపూర్ రిజర్వాయర్లను నింపి సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతులకు మేలు చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుండి మోటార్లను ఆన్ చేసి వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
మిడ్ మానేరు, లోయర్ మానేరులో ప్రస్తుత నీటి లభ్యత
మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 22 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద నీటి లభ్యత కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్ పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 6.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, మిడ్ మానేరు నుండి లోయర్ మానేరుకు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్-2 ఆయకట్టుకు నీరు అందించాలని కోరారు.
రాజకీయాలకు అతీతంగా వెంటనే చర్యలు తీసుకోవాలి
గత యాసంగిలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పై రిజర్వాయర్ల ఆయకట్టులో 4 లక్షల ఎకరాలు సాగైన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ వానాకాలం, వచ్చే యాసంగికి కూడా సాగునీరు అందించేలా అన్ని రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేశారు. వాటి అనుసంధానంగా ఉన్న కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్లను నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని లేఖలో కోరారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటిని ఒడిసిపట్టి రైతు ప్రయోజనాల దృష్ట్యా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق