రైల్వే గేటు (209/A) వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకంగా వినతి
300 మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టం - రోడ్లు లేకుండా పోతాయని ఆవేదన
కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మూడు కాలనీల వాసులు
కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ, స్నేహపురి కాలనీ, కే.పీ.ఆర్. కాలనీ వాసులు రైల్వే గేటు (209/A) వద్ద ఓవర్ హెడ్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ సెలవుల్లో ఉండగా, అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ ) ఎన్ వై గిరి కు తమ గోడును విన్నవించారు.
ఈ మేరకు అశోక్ నగర్ కాలనీలో గల రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు తెలిసిందని, దానిని సర్వే చేసి మార్కింగ్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. దీనికి గాను తమ ఇండ్లు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు స్వాధీనం చేసుకునే ప్రక్రియ జరుగుతుందని తెలిసిందని, ఇదే జరిగితే దాదాపు మూడు వందల (300) మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఇండ్లు, ప్లాట్లు కోల్పోయి తీవ్ర నష్టం జరిగి, తాము రోడ్డు పాలు అయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయకుండా అట్టి ప్రతిపాదనను ఉపసంహరించగలరని వారు ప్రార్థించారు.
ఈ వినతిపత్రం ప్రతిని పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే స్టేషన్ మాస్టర్ తదితరులకు పంపించారు.
ఈ కార్యక్రమంలో తోట నాగరాజు, మహమ్మద్ నజీర్ అహమ్మద్, తోట సురేష్, తోట రాజేశ్వర్ రావు, టేకుల కర్ణాకర్, Md Ilyas,Mohd. Moulana, Md. Maqdoom, Md. A. Raheman, M.A. Gaffar, Shadulla Pasha, CH. Laxminarayana, Singada Prakash తదితర 16 మంది కాలనీ వాసులు సంతకాలు చేసి వినతిపత్రాన్ని అందజేశారు.



إرسال تعليق