జుక్కల్లో ఆహార భద్రతాధికారి తనిఖీలు - నిబంధనలు పాటించని సంస్థలకు నోటీసులు
జుక్కల్, సెప్టెంబర్ 03: జుక్కల్ పట్టణంలో ఆహార భద్రతాధికారి విక్రమ్ ఆధ్వర్యంలో గురువారం కిరాణా, డిస్ట్రిబ్యూషన్ షాపులు, బేకరీలు, స్వీట్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో పలు ఆహార వ్యాపార సంస్థలు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని ఆహార ఉత్పత్తులపై లేబుల్ నిబంధనలు పాటించకపోవడం, తయారీ తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ వంటి వివరాలు లేకపోవడాన్ని గమనించారు. బేకరీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆహార భద్రతాధికారి విక్రమ్ మాట్లాడుతూ.. ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందాలని, ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, రానున్న రోజుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు.


إرسال تعليق