బీబీపేట్లో రైస్ మిల్లు, కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
అన్లోడింగ్ చేసి మిల్లింగ్ వేగవంతం చేయాలని ఆదేశాలు
తెలంగాణ డైలీ న్యూస్, బీబీపేట్: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్లు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు.
మహేశ్వరి రైస్ మిల్లులో పరిశీలన
మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్లోడింగ్ చేసి మిల్లింగ్ వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా అందజేయాలని తెలిపారు.
కొనుగోలు కేంద్రంలో తనిఖీ
రైతులు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యత, తూకం విధానం, హమాలీ సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, టార్పాలిన్లు ఏర్పాటు చేసి తడవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ నమోదు, టోకెన్ వ్యవస్థ, చెల్లింపుల వివరాలను పరిశీలించి పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యపు గింజకు మద్దతు ధర అందేలా చూడాలని తెలిపారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీఓ రామ్ మోహన్, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment