కమ్యూనిటీ మెడియేషన్ వాలంటీర్లను అభినందించిన ఆర్డీఓ
100కు పైగా కేసులు పరిష్కారం - బాన్సువాడ వాలంటీర్ల సేవలకు ప్రశంస
కోర్టు ఖర్చులు లేకుండా ప్రజా సమస్యలకు పరిష్కారం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: కమ్యూనిటీ మెడియేషన్ సెంటర్ బాన్సువాడ వాలంటీర్ల కృషిని ఆర్డీఓ ఎ. రవీందర్ రెడ్డి ప్రశంసించారు. కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 100కు పైగా భార్యాభర్తలు, సీనియర్ సిటిజన్ కేసులను పరిష్కరించిన బాన్సువాడ మీడియేషన్ వాలంటీర్లు ఎ. పుష్పవతి, ఎ. రామకృష్ణారెడ్డి, అయ్యాల సంతోష్, ఎండీ హైమద్ హుస్సేన్, ఎన్. సాయిబాబాల సేవలను ఆయన కొనియాడారు.
ఈ వాలంటీర్లు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా కమ్యూనిటీ మెడియేషన్ వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రజలకు కోర్టు ఖర్చులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తున్నారని ఆర్డీఓ తెలిపారు. కోర్టులు, పోలీస్ స్టేషన్లు తిరగకుండా, అనవసర ఖర్చులు కాకుండా ప్రజలకు స్వచ్ఛందంగా కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని అన్నారు.
మీడియేషన్ వాలంటీర్లకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలు చిన్నచిన్న వివాదాల కోసం కోర్టులను ఆశ్రయించకుండా స్థానికంగా మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

Post a Comment