_జూలై 5న భువనగిరిలో ‘రాజ్యాధికార సమరభేరి’ సభ_
_బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా సభను విజయవంతం చేయాలని పిలుపు_
_కామారెడ్డి అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ విడుదల_
_‘మేమెంతో మాకంత’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తాం: నేతలు_
టీడీఎన్/కామారెడ్డి, జూన్ 22: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో తలపెట్టిన ‘రాజ్యాధికార సమరభేరి’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ కామారెడ్డి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ తాహేర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
*బీసీ వాదమే ప్రధాన ఎజెండా*
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మా రోజూ వీరన్న, బెల్లి లలిత స్ఫూర్తితో బీసీ వాదాన్ని రాష్ట్రంలో గట్టిగా వినిపించేందుకు తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారని తెలిపారు. 64 శాతం ఉన్న బీసీ ప్రజల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమన్యాయం జరగాలని, ఎవరు ఎంత శాతం ఉంటే అంత శాతం రాజకీయంగా, సామాజికంగా వాటా కావాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.
*బీసీ సీఎం లక్ష్యం*
రాబోయే రోజుల్లో కచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేసే సంకల్పంతో, అగ్రవర్ణాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా పోరాటం చేస్తామని నేతలు పేర్కొన్నారు. ‘మేమెంతో మాకంత’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు.
*కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు*
టీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలోనూ తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదని ధ్వజమెత్తారు. సంవత్సరానికి రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లకు లక్ష కోట్లు కేటాయించకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.
*భారీగా తరలిరావాలని పిలుపు*
భువనగిరి సభకు కామారెడ్డి జిల్లా నుంచి బీసీలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని నేతలు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెం రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, జుక్కల్ ఇంచార్జ్ ఈశ్వర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, నాగిరెడ్డిపేట్ మండల అధ్యక్షుడు దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment