కామారెడ్డిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్షేత్ర పరిశీలన
SIR సర్వే, డ్రై డే, పాఠశాల, వనమహోత్సవ కార్యక్రమాలను పరిశీలన
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం కామారెడ్డి పట్టణంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజాస్వామ్యం, ప్రజారోగ్యం, విద్య, పర్యావరణం అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ - SIR కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫారమ్ సేకరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫారమ్ సేకరణలో పారదర్శకత పాటించాలని, ఎవరూ మినహాయింపు కాకుండా ప్రతి అర్హుడి పేరు జాబితాలో చేరేలా చూడాలని సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ఫారమ్లు సేకరించి సమయానికి సంబంధిత కార్యాలయాలకు అందజేయాలని తెలిపారు.
సేకరించిన ఫారమ్లను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్ చేసి డేటా ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీలో పొరపాట్లు జరగకుండా ప్రతి ఫారమ్ను రెండుసార్లు ధృవీకరించాలని, డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత తుది ఓటరు జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి అర్హుడి పేరు తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేశారు. BLOలు, సూపర్వైజర్లు, తహశీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలలు, కళాశాలలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
డెంగ్యూ, మలేరియా వంటి కాలానుగుణ వ్యాధుల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
35వ వార్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
అదే పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ N.Y. గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ టి. పర్వతాలు, 35వ వార్డు కౌన్సిలర్ బోజన్నగారి వినోద, తహశీల్దార్ హిమబిందు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పర్యటన ద్వారా ప్రజా ఆరోగ్యం, విద్యా సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
=====================
మొహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ మంగళవారం మొహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లో పర్యటించి ఎస్ఐఆర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మొదట మొహమ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామం, పోలింగ్ స్టేషన్ నెం. 251ను సందర్శించి బూత్ లెవల్ అధికారి (BLO), సూపర్వైజర్, తహసీల్దార్తో కలిసి ఇంటింటి ఎన్యుమరేషన్, ఓటరు వివరాల ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్నగర్, బంజేపల్లి గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ కొనసాగుతున్న ఎస్ఐఆర్ పనులను సమీక్షించారు.
బీఎల్వోలు, సూపర్వైజర్లు, తహసీల్దార్తో మాట్లాడి ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ, ఓటరు వివరాల నమోదు, డిజిటైజేషన్ పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ పర్యటనలో సంబంధిత తహసీల్దార్లు, బూత్ లెవల్ అధికారులు (BLOలు), సూపర్వైజర్లు, ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.





Post a Comment