మిలాద్ ఉన్ నబీ వేడుకలు ప్రశాంతంగా జరగాలి
ఐదు జిల్లాల అధికారులతో డీఐజీ సన్ప్రీత్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్
పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు
కామారెడ్డి : మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్, జోన్-3, రాజన్న-కరీంనగర్ ఇన్చార్జి డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 26న జరగనున్న మిలాద్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
DIG సూచనలు...
- ర్యాలీలకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలి. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద పికెట్లు ఏర్పాటు చేయాలి.
- ర్యాలీలను మొదటి నుంచి చివరి వరకు వీడియో, ఫొటోగ్రఫీ చేయాలి.
- నిర్వాహకుల వివరాలు సేకరించి వారి బాధ్యతలను నిర్దేశించాలి.
- ఎలాంటి రెచ్చగొట్టే, అభ్యంతరకర ప్రసంగాలు లేకుండా చూడాలి.
- గతంలో వివాదాస్పద ప్రసంగాలు చేసిన వారిని గుర్తించి ముందస్తుగా హెచ్చరించాలి.
- వేర్వేరు వర్గాల ర్యాలీలు ఎదురెదురు రాకుండా సమన్వయం చేసుకోవాలి.
- బందోబస్తు సిబ్బందికి ముందస్తుగా బ్రీఫింగ్ ఇవ్వాలి. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి.
- యువత, విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ఎస్ఐలు, సీఐలు పై సూచనలను కచ్చితంగా అమలు చేయాలని డీఐజీ ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, జిల్లా పోలీసు అధికారులతో మరో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పోలీస్ స్టేషన్ల వారీగా జరగనున్న మిలాద్-ఉన్-నబీ కార్యక్రమాల పూర్తి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమాల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.




إرسال تعليق