ఆశయాల సాధనకు కృషి చేయాలి: షబ్బీర్ అలీ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షబ్బీర్ అలితో పాటు అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.
వారు మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్తగా నిలిచారని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి సంస్కర్తల్లో ఆయన ఒకరని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Post a Comment