![]() |
| కలెక్టర్ ను ఘనంగా సన్మానిస్తున్న దృశ్యం |
•ఘనంగా వీడ్కోలు సన్మానం
•నిర్మల్ జిల్లాలో పనిచేయడం ఒక మధురమైన అనుభవం: కలెక్టర్
తెలంగాణ డైలీ న్యూస్ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్గా విశేష సేవలందించి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ అభిలాష అభినవ్కు బుధవారం రాత్రి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ, కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పరిపాలనలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
విపత్తుల సమయంలో సమర్థవంతమైన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం, శాఖల మధ్య సమన్వయం సాధించడం ద్వారా జిల్లాను రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపారని గుర్తు చేసుకున్నారు.
సన్మాన గ్రహీత కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నిర్మల్ జిల్లాలో పనిచేయడం తనకు ఒక మధురమైన అనుభవమన్నారు. టీమ్వర్క్తోనే లక్ష్యాలను సాధించగలిగామని, నిర్మల్ ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment