ప్రభుత్వ భూమి కబ్జా ప్రయత్నిస్తే కఠిన చర్యలు
మహమ్మద్ నగర్ మండలం హసన్ పల్లిలో సర్వే నంబర్ 70/1లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
తెలంగాణ డైలీ న్యూస్, మహ్మద్ నగర్ :
ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని మహమ్మద్ నగర్ మండల తహసిల్దార్ లత హెచ్చరించారు.
సోమవారం హసన్ పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 70/1లో ఉన్న ప్రభుత్వ భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ లత మాట్లాడుతూ, ఇటీవల కొందరు ఆ ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించి, భూమిని ప్రభుత్వ ఆధీనంలోనికి తీసుకున్నామన్నారు.
ప్రభుత్వ భూమిలో వరి నాటు వేయవద్దని సంబంధిత వ్యక్తికి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ, హెచ్చరికలను పట్టించుకోకుండా వరి నాటు వేయడంతో ఈ చర్య తీసుకున్నామని వివరించారు.
ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఎవరైనా తొలగించినా, మళ్లీ ఆక్రమించేందుకు ప్రయత్నించినా చట్టపరంగా కేసు నమోదు చేస్తామని తహసిల్దార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment