మల్లుపేట చౌరస్తా వద్ద కార్లు ఢీ: పలువురికి గాయాలు
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఇంచార్జ్ ఎస్పీ సాయి చైతన్య
అదుపుతప్పిన XUV-300 ఎదురుగా వచ్చిన Aura కారును ఢీకొట్టింది
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ పునరుద్ధరణ
సత్వర చర్యలపై పోలీస్ సిబ్బందికి కమిషనర్ అభినందనలు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 22: సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని కామారెడ్డి ఇంచార్జ్ ఎస్పీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సందర్శించి పరిశీలించారు.
ఎలా జరిగింది?
నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహీంద్రా XUV-300 కారు అదుపుతప్పి, ఎదురుగా కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న హ్యుందాయ్ Aura కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు.
ఎస్పీ సత్వర స్పందన
అదే మార్గంలో వెళ్తున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆగి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారిని అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించి అవసరమైన వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు.
ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు తక్షణమే స్పందించి ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
సత్వరం స్పందించి చర్యలు చేపట్టిన అధికారులు, సిబ్బందిని కమిషనర్ అభినందించారు.


Post a Comment